naveen3944370016975916433

నవీన్‌ తల తెస్తే రూ.50 లక్షల నజరానా

జనరల్

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగలూరు నగరంలోని డీజే హళ్లి – కేజీ హళ్లి అల్లర్లకు కారకుడైన నవీన్‌ తల తెస్తే రూ.50 లక్షలు నజరానాగా ఇస్తానని మీరట్‌కు చెందిన శహజీబ్‌ రిజ్వి అనే వ్యక్తి వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. ముస్లిం సముదాయాన్ని అవహేళన చేస్తూ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన నవీన్‌ను తనకు పట్టించాలని పేర్కొన్నాడు. అయితే మత విద్వేషాలకు రెచ్చగొట్టే విధంగా ట్వీట్‌ చేసిన శహజీబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు సహజమని.. ఇంత రాద్దాంతం సరికాదని నవీన్‌ తండ్రి పవన్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ఉన్నారు. శిక్షించేందుకు న్యాయస్థానం ఉంది. చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు.. కానీ భౌతిక దాడుల వెనుక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈనెల 5వ తేదీన అయోధ్యలో రామమందిరానికి భూమిపూజ సందర్భంగా నవీన్‌ బాణసంచా పేల్చాడు. అదేరోజున చిన్నపాటి గొడవ జరిగింది. ఆరోజు నుంచి కక్ష కట్టిన కొందరు నేతలు లేనిపోని రచ్చ చేశారన్నారు. ఈనెల 11వ తేదీ రాత్రి బెంగళూరులోని డీజే హళ్లి – కేజీ హళ్లి పరిధిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 29 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 84 మందిని బళ్లారి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.